Desamudurlu - Posani Murali - Comedian Prudhviప్రస్తుతం పాదయాత్ర చేస్తోన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలో మానవాతీత శక్తి ఏమైనా ఉందా? అసలు ఈ అనుమానం ఎవరికీ వచ్చింది? ఎందుకు వచ్చింది? అనుకుంటున్నారా..! ఎవరికో కాదులేండి… ఫాంటసీ ప్రపంచంగా కొనియాడే సినీ ఇండస్ట్రీలో కొలువుతీరి ఉన్న పోసాని కృష్ణమురళీకి ఈ డౌట్ వచ్చింది, అది కూడా జగన్ చేస్తోన్న పాదయాత్రను కళ్ళారా చూసిన తర్వాత తనకు ఇలా అనిపించిందని, ఇటీవల సాక్షి మీడియాలో జరిపిన ఓ చర్చలో చెప్పుకొచ్చారు.

గడిచిన కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తోన్న జగన్ మోహన్ రెడ్డి పాదాలు బొబ్బలు కట్టేసాయని, నిజంగా ఆ పాదాలతో మరొకరు అయితే నడవడం అసాధ్యమని, బహుశా మానవాతీత శక్తి ఏమైనా ఉందేమో తనకు తెలియదు గానీ, ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి, ధృడసంకల్పం ఆయన నరనరాల్లో జీర్ణించుకునిపోయిందేమోనని చెప్పుకొచ్చారు. దీనికి పక్కనే ఉన్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా వంత పాడుతూ, జగన్ పై తమకున్న వీరాభిమానాన్ని చాటుకున్నారు.

అయితే వారి ప్రేమను చూపించుకునే క్రమంలో సహజంగా చెప్పే సినీ డైలాగ్ లు వచ్చేసినట్లున్నాయి గానీ, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు 60 ఏళ్ళు నిండిన తర్వాతే పాదయాత్రలు చేసారు. ఈ క్రమంలో కాలికి బొబ్బలు రావడం అత్యంత సహజం. వైఎస్, బాబులకు కూడా ఇలాగే వచ్చాయి, వాళ్ళు నడిచారు. అయితే సినీ ప్రపంచంలో పాదయాత్రలకు అవకాశం ఉండదు గనుక, వీరిద్దరికీ అవగాహన లేకపోవచ్చు లేదంటే వైఎస్, బాబు యాత్రలను ఫాలో అవ్వలేదేమో!

60 ఏళ్ళు నిండిన వారే చేయగలగగా, యువకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడంలో ఆశ్చర్యం ఏముందో వారికైనా తెలుసా? ఏదో వారి అభిమానాన్ని చూపించుకోవాలన్న తాపత్రయం తప్ప! వైసీపీ టికెట్ కోసం పృధ్వీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఉన్న నేపధ్యంలో… ఇలాంటి వారి నుండి భజనలు రావడం సహజం. కానీ తాను ఏమీ ఆశించను అని చెప్పుకునే పోసాని కృష్ణమురళీ చేస్తోన్న భజనలకు ఆంతర్యం ఏమిటి?! ‘నవ్విపోదురు గాక నాకేటి’ అన్న రీతిలో ఉన్న వీరి స్పందనలను నెటిజన్లు ఆడుకోకుండా ఉంటారా?