ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుష్పశ్రీవాణి తొలిసారిగా సొంత జిల్లా విజయనగరం విచ్చేయడంతో అభినందనలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులు భోగాపురం మండలం రాజాపులోవ సమీపంలో జాతీయరహదారి పక్కన సభావేదిక ఏర్పాటు చేశారు. వేదికపైకి ముందుగానే కార్యకర్తలు భారీగా చేరుకుని మంత్రి కోసం వేచి చూస్తున్నారు. .
ఈలోగా మంత్రి రాణే వచ్చి మరికొందరు నాయకులు సభావేదికపై వెళుతుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే మంత్రి వెంటనే అప్రమత్తమైన కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఆమె కు ఉన్న గన్ మెన్లు వెంటనే ఆమెను దూరంగా తీసుకుని వెళ్లారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామంతో ఖంగుతున్న మంత్రి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెంటనే తిరిగి విజయనగరం పయనమయ్యారు.
సామాజిక సమతుల్యం పేరుతో జగన్ మోహన్ రెడ్డి ఈ సారి తన కేబినెట్ లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల్లో ఒక్కొక్కరికి ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. ఎస్టీ కోటాలో కురుపాం నుంచి రెండు సార్లు వరుసగా గెలిచిన పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చారు జగన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈమె టీడీపీలో చేరతారని గట్టి ప్రచారం జరిగినా.. ఆమె వైసీపీని వీడకుండా జగన్ నాయకత్వంలోనే పనిచేస్తూ వస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా మంత్రి పదవి దక్కింది.