Demonetization Cash deposit for year end 2016పాత నోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు గడువు తేదీ అయిన డిసెంబర్ 30వ తేదీ నాడు ఎంత మొత్తంలో డిపాజిట్ చేసారు? అన్న ప్రశ్న ప్రతి పౌరుడ్ని వేధిస్తోంది. అయితే దేశం మొత్తంగా ఎంతో తెలియాలంటే కాస్త సమయం పడుతుంది గానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దాదాపు 630 కోట్లు జమయ్యాయని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే 33 కోట్లు డిపాజిట్ కాగా, 2 బ్యాంకుల్లోని 5 ఖాతాల్లోనే 67 కోట్లు జమ అయినట్లుగా గుర్తించగా, చివరి రోజున లావాదేవీలపై ఐటీ అధికారులు నిశితంగా పరిశీలించారు.

తిరుపతిలోని 10 ఖాతాల్లో సగటున 6 కోట్ల చొప్పున జమ కాగా, ఆఖరి రోజున ఒక కోటి కన్నా అధిక మొత్తాన్ని బ్యాంకుల్లో వేసుకున్న వారిలో 115 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు ‘గరీబ్ కల్యాణ్ యోజన’ కింద పన్ను చెల్లించేందుకు అంగీకరించి లేఖలు ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గడచిన ఏడాది కాలంలో తన ఖాతాలో 11 వేలు మాత్రమే జమ చేసిన తిరుపతిలోని ఓ చిరు వ్యాపారి ఏకంగా 50 లక్షలను జమ చేసినట్టు అధికారులు గుర్తించారు.

కాగా, నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకు శాఖల్లో దాదాపుగా 1.48 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం కరెన్సీలో దాదాపుగా 10 శాతం వాటా అన్న మాట. దేశ వ్యాప్తంగా దాదాపుగా 14 నుండి 15 లక్షల కోట్ల మధ్యలో పాత నోట్లు డిపాజిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి గానీ, కేంద్ర ప్రభుత్వం నుండి గానీ అధికారిక ప్రకటన వెల్లడికానుంది.