బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునేకు గాయాలయ్యాయి. అయితే ఈ గాయాల బారిన పడిన కారణం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..! ఎందుకంటే దీపికా లేటెస్ట్ సెన్సేషన్ ‘పద్మావతి’ సినిమా కోసం ధరించిన నగల కారణంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకునే రాణి ‘పద్మావతి’గా కనిపించనుంది.
రాణి పాత్ర కావడంతో దీపిక కాస్ట్యూమ్స్ తో పాటు, బరువైన నగలు ధరించాల్సి ఉండగా, ఆమె మెడకు ధరించిన నగలే దీపికకు గాయం చేశాయట. దీంతో చిత్రయూనిట్ షూటింగ్ కు బ్రేక్ వేసి, దీపికకు విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం షూటింగ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు కూడా చేసినట్లు సమాచారం. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను నవంబర్ 17న విడుదల చేయనున్నారు.