ట్విట్టర్ వేదికగా పవన్ చేసిన ఓ ట్వీట్ ను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ ప్రచురించింది. ‘తన భావాలను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ’ పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలుపుతూ పవన్ చేసిన ట్వీట్ ను ప్రామాణికంగా చేసుకుని ఈ కధనం ప్రచురితమైంది. అయితే ఇందులో అతి పెద్ద ట్విస్ట్ ఏమిటంటే… పవన్ చేసిన ట్వీట్ కు ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు మద్దతు ప్రకటించడం.
ఏంటి షాకింగ్ గా ఉందా..? ఈ కధనం ప్రకారం అయితే వారిద్దరూ పవన్ కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. అదే నెటిజన్లకు వరమైంది, ఆట షురూ అయ్యింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఎకౌంటులలో ఒక అక్షరం మార్పిడిలో అనేక ఫేక్ ఎకౌంటులు ఉంటాయన్న విషయం కొత్త కాదు. అందులో భాగంగానే పవన్ చేసిన ట్వీట్ కు మహేష్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లతో ఉన్న సదరు ఫేక్ అకౌంట్ లు వెంటనే స్పందించారు.
జాతీయ పత్రిక అయ్యుండి ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రచురించడం అనేది ఊహించినది కాదు. ఈ కధనంతో సదరు పత్రికలో ప్రచురితం అవుతోన్న నాణ్యత కూడా ప్రశ్నార్ధకంగా మారింది. తప్పులు దొర్లడం మానవ సహజం… అయితే సెలబ్రిటీల ఖాతాలకు ‘టిక్’ మార్క్ ఉంటుందన్న కనీస జ్ఞానం కూడా పాటించకుండా రాసిన ఈ వ్యాసం సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.