ఢమరుఖం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఏ ముహూర్తాన ఆ సినిమా మొదలు పెట్టాడో కానీ అప్పటి నుండి అన్నీ ఇబ్బందులే. ఆ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ చివరకు విడుదలై ప్లాప్ అయ్యింది. 2012లో విడుదలైన ఆ సినిమా తరువాత ఈ ఏడాది ముందు వరకు కేవలం ఒకే సినిమా చేసారు. తాజాగా ఆయన కొత్త చిత్రం రాగాల 24 గంటల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సత్యదేవ్, ఈషా రెబ్బ నటించిన ఈ సినిమాకు టాక్ పర్లేదు అని వినిపిస్తున్నా వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో లేదు. ఇది ఇలా ఉండగా ఈరోజు సినిమా ప్రెస్ మీట్ లో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేశాడు దర్శకుడు. పైగా రాగాల 24 గంటల్లో సినిమాను నిర్మించిన నిర్మాతలే తన తదుపరి చిత్రం కూడా నిర్మించనుండడం విశేషం.
“సినిమా టైటిల్ భార్యదేవోభవ. ఇందులో ప్రముఖ హీరో నటించనున్నారు. పది మంది హీరోయిన్స్ నటించనున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ వలే.. భార్య గొప్పతనం తెలియచేసేలా భార్యదేవోభవ ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తాను,” అని చెప్పుకొచ్చారు.
ఇది ఇలా ఉండగా రాగాల 24 గంటల్లో సినిమా కోసం బుధవారం నుంచి సక్సస్ టూర్ ప్లాన్ చేస్తున్నారట. వైజాగ్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఈ సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్స్ కి వెళ్లి ప్రేక్షకులను కలుస్తాం అని చిత్రబృందం ప్రకటించింది. మరి ఈ టూర్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూడాలి.