ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎవరూ ఊహించని రీతిలో రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత నేతల్లో రాజకీయ విలువలు నానాటికీ దిగజారుతున్నాయని, ఒక పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన తర్వాత… అవతలి పార్టీ ఏదైనా ఆశ చూపితే, పార్టీ మారిపోతున్నారని… ఇది ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుందని చెప్పారు.
జనం పార్టీ మీద అభిమానంతోనో, మీ మీద నమ్మకంతోనో ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీకే పనిచేయాలని… పార్టీ మారిపోతే విలువలను వదులుకోవడమే అవుతుందని అన్నారు. నమ్మి ఓటేసిన ఓటర్లను మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మద్యం, డ్రగ్స్, ధూమపానం సినిమాలు రాక ముందు నుంచే ఉన్నాయని… సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని చెప్పారు.
ఏ రంగానికైనా క్రమశిక్షణ అనేది అవసరం అని, రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని సురేష్ బాబు తెలిపారు. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవడంలో వీరికి ఎవరూ సాటిరారని కొనియాడారు. ఎప్పుడూ సినిమాలు తప్ప మరొక విషయం గురించి మాట్లాడని సురేష్ బాబు, రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి మాట్లాడడంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.