బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాటలు చిత్రంగా ఉన్నాయి. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశంపై ఢిల్లీలో బీజేపీ యేతర ప్రభుత్వాలతో సీఎం చంద్రబాబు పోరాడటాన్ని ఆమె తప్పు పట్టారు. ఎన్నికలు, పోలింగ్ అంశాలకు సంబంధించి ఈసీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. ఓటమి భయంతో ఇతరులను విమర్శించడం సాధారణమైన విషయమన్నారు. ధైర్యం ఉంటే ఫలితాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలని సూచించారు.
ధైర్యం ఉంటే ఎన్నికల ఫలితాలు స్వీకరించడం ఏంటి? ధైర్యం ఉన్నా లేకపోయినా, స్వీకరించినా స్వీకరించకపోయినా ఫలితాలు ఫలితాలే. ఇంకో మాటగా ఓటమి అంచుల్లో ఉన్నవాళ్లే ఆరోపణలు చేస్తుంటారని పురందేశ్వరి ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈవీఎంల మీద ఆరోపణలు చెయ్యడం లేదు కాబట్టి పురందేశ్వరి గారు ఓటమి అంచున లేనట్టా ఏంటి? ఈ నెలన్నర వరకూ ఎవరికీ కావలసింది వారు చెప్పుకోవచ్చు. ప్రజలు ఏం కావాలనుకున్నారో, వారు ఏం చెప్పారో మే 23న బయటకు వస్తుంది.
ఇక పురందేశ్వరి విషయానికి వస్తే విశాఖపట్నం పార్లమెంట్ కు పోటీ చేసిన ఆమె ఈ సారి నాలుగో స్థానంలో ఉండవచ్చు. గట్టిగా అనుకూలమైన ఫలితాలు అంటే మూడో స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇక ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ పై పర్చూరు నియోజకవర్గానికి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఇక్కడ ఫేవరేట్ అని వార్తలు వస్తున్నాయి. ఇవే ఫలితాలు వస్తే రాజకీయాలలో దగ్గుబాటి కుటుంబానికి ఇబ్బందే అని చెప్పుకోవాలి.