Daggubati Purandeswari blessings to Nandamuri Suhasiniటీడీపీ తరపున కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని పై పురంధేశ్వరి స్పందించారు. “టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి మీ సహకారం ఉంటుందా” అని అడిగిన ప్రశ్నకు పురందేశ్వరి నవ్వుతూ.. ఓ మేనత్తగా కోడలికి ఎప్పుడూ ఆశీర్వాదం ఉంటుందన్నారు. పార్టీ పరంగా తాము వ్యతిరేకమైనా మేనకోడలిగా ఆమెకు తన దీవెనలు ఉంటాయని పురంధేశ్వరి స్పష్టం చేశారు. అలాగే కూకట్ పల్లి లో పార్టీ తరపున ప్రచారం చెయ్యడానికి కూడా పురంధేశ్వరి నిరాకరించినట్టు సమాచారం.

ఇటీవలే కాలం చేసిన హరికృష్ణ కుమార్తె కావడంతో సుహాసినికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చెడ్డ పేరు వస్తుందని పురంధేశ్వరి భావిస్తున్నారట. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ప్రచారం చేస్తే పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ భావించింది. అయితే పురంధేశ్వరి సమాధానం వాళ్ళు వెనక్కు తగ్గారు. పురంధేశ్వరి సమస్యను తాము అర్ధం చేసుకోగలమని పార్టీ నాయకులు అంటున్నారు. ఒకరకంగా సుహాసిని అభ్యర్థిత్వంతో చంద్రబాబు కుటుంబ సభ్యులకు ముందు కాళ్ళ బంధం వేసినట్టు అయ్యింది.

ఇప్పటికే కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కాసింత మెత్తబడి ట్విట్టర్ సాక్షిగా ఆవిడకు మద్దతు తెలిపారు. అయితే డైరెక్టుగా ప్రచారానికి మాత్రం వారు వచ్చే అవకాశం కనిపించడం లేదు. బాలయ్య మాత్రం ఈ నెలాఖరుకు రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. నామినేషన్ మొదలుకొని బాలయ్య అడుగడుగునా సుహాసినికి మద్దతుగా నిలిచారు. ఆయన అభిమానులు ఇప్పటికే రంగంలోకి దిగి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు.