Daggubati Purandeswariఆంధ్రప్రదేశ్ లో చీమ చిటుక్కుమన్నా మీడియా ముందు వాలిపోతారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు… రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబుని తిట్టడానికైతే ఇంకా స్పీడ్ గా వచ్చేస్తారు. అయితే ఎందుకనో వైఎస్సార్ కాంగ్రెస్ ని విమర్శించే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆ ఆత్రుత కనిపించదు.

కొత్తగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితురాలైన దగ్గుబాటి పురంధేశ్వరిని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి దూషిస్తే మాత్రం వారు ఇప్పటి వరకూ స్పందించలేదు. ఈనాడుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె వికేంద్రీకరణ జరగాలని కానీ రైతులకు మాట ఇచ్చినట్టుగా అమరావతిలోని రాజధాని ఉండాలని అన్నారు.

దానిపై మండిపడుతూ… “పురంధేశ్వరి ఈ రోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది’ అంటూ ఎద్దేవా‌ చేశారు. ఒక జాతీయ స్థాయి నాయకురాలు… తమ పార్టీ జాతీయ కార్యదర్శిని జాతి నాయకురాలు అన్నా బీజేపీ నాయకులు స్పందించకపోవడం విశేషం.

దీనిబట్టి ఆ పార్టీలోని అంతర్గత విబేధాలు… అలాగే పురంధేశ్వరి ని చంద్రబాబు కుటుంబసభ్యురాలుగా చూడటం వల్లో…. లేక నిజంగా విజయసాయి రెడ్డి అన్నట్టు ఒక జాతి నాయకురాలిగానో చూడటం వల్ల ఆమెను తిట్టినా వారికి బాధ కలగకపోయి ఉండవచ్చు. అయితే ఈ అనైక్యత అనేది పార్టీకి నష్టం చేస్తుంది అనేది తెలుసుకుంటే వారికే మంచిది.