rakul preeth singh furious on her rumorsఈ నెల 22వ తేదీన విడుదల కాబోయే బోయపాటి – బన్నీల ‘సరైనోడు’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ‘సరైనోడు’లో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో ‘మహాలక్ష్మి’ అనే పాత్రను పోషించానని, అయితే ఆ పాత్రకు, తన నిజజీవితానికి అస్సలు సంబంధం లేదని, తాను లొడలొడా వాగుతూ ఉంటానని, మహాలక్ష్మి మాత్రం పెద్దగా మాట్లాడదని, రాజమండ్రి నుంచి వచ్చిన ఓ యువతి ఎలా ఉంటుందో సినిమాలో తన పాత్ర అలా ఉంటుందని చెప్పుకొచ్చింది.

ఇక, డ్యాన్స్ ల విషయానికి వస్తే… ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో ‘బ్రూస్ లీ’ తర్వాత ‘సరైనోడు’ సినిమాలోనే ఎక్కువ డాన్స్ లు చేశానని, తన మొదటి సినిమా నుండి ‘సరైనోడు’ వరకు డాన్సుల్లో చాలా నేర్చుకున్నానని రకుల్ తెలిపింది. తనకు స్టార్ డమ్ అంటే ఏంటో తెలియదని, ఇప్పటికీ స్నేహితులు, సన్నిహితులతో బయటకు వెళ్లినప్పుడు మామూలుగా ఉంటానని, సినిమా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు స్టైల్ గా ఉండాలని అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఉన్నప్పుడు ఉందని మిడిసిపడితే, పోయిన తరువాత ఇబ్బంది పడాలని జీవిత సత్యాలు కూడా పలికింది ఈ స్టార్ హీరోయిన్.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి అంత స్టైలిష్, అందమైన విలన్ తో నటించడం భలే ఉంటుందని, ఆది అద్భుతంగా నటించాడని చెప్పింది. ‘సరైనోడు’ సినిమా మీ డబ్బులకు పూర్తిగా న్యాయం చేస్తుందని, కుటుంబ సమేతంగా ధియేటర్ కు వెళ్లి చూడాలని, తెలుగు సినీ ప్రేక్షకులు అందించిన అభిమానం మర్చిపోలేనని, ఇంత అభిమానం చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తన మనోభావాలు పంచుకుంది రకుల్.