ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్డిఏ) అంటే రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ. చంద్రబాబు నాయుడు హయాంలో చురుకుగా పనిచేసిన సిఆర్డిఏకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనిలేకుండా పోయింది. ఎందుకో అందరికీ తెలుసు.
అయితే మూడేళ్ళ తరువాత మళ్ళీ దానికి పని దొరికింది. అంటే అమరావతి అభివృద్ధి చేయడమో లేదా భవన నిర్మాణ పనులను పర్యవేక్షించడమో కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను వేలం వేసే పని!
అమరావతిలో నవులూరు, మంగళగిరిలో (లాట్-2)లో భాగంగా మొత్తం 18 ప్లాట్లను ఈవేలం వేయబోతున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాట్ రూ.16-17,000 కనీస ధరగా నిర్ణయించింది. వేలానికి పెట్టిన ఫ్లాట్లలో హెల్త్ సెంటర్, ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాల, లోకల్ కమర్షియల్, ధియేటర్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 12వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ చేసి జూలై 28వ తేదీన ఆన్లైన్లో ఈ-వేలం వేయబోతున్నట్లు ప్రకటించింది.
రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సిఆర్డిఏ సంస్థ చివరికి ఆ భూములను వేలం వేసే సంస్థగా మిగిలిపోవడం చాలా బాధాకరమే కదా?