సామాన్య జీవితం తో పాటు ఆర్ధిక వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేసేసింది కరోనా వైరస్. దీని నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈతరుణంలో ప్రజల నెత్తిన పాలు పోసినట్టుగా తమ వాక్సిన్ ఆరు వారాలలో బయటకు వచ్చే అవకాశం ఉందని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది.
ప్రస్తుతం జరుగుతున్న చివరి ఫేస్ హ్యూమన్ ట్రయల్స్ లో వాక్సిన్ సేఫ్ అని తేలితే అవసరమైతే చట్టాలను మార్చి వాక్సిన్ తొందరగా ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ప్రజలకు పంపిణీ చేసి కొత్త సంవత్సరం నాటికి ప్రజలు తమ సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటివరకు జరిగిన ట్రయల్స్ లో వాక్సిన్ తీసుకున్న వాలంటీర్ల శరీరంలో యాండీ బాడీలు, తెల్లరక్త కణాలు తయారయ్యాయని.. కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదురించేలా రోగనిరోధక వ్యవస్థను సన్నద్ధం చేస్తోందని వెల్లడించారు. ఇది సురక్షితమైనదన్న శాస్త్రవేత్తలు.. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని పేర్కొన్నారు.
తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు మాత్రమే కనిపించాయి చెప్పారు. పారాసిటమాల్ టాబ్లెట్స్తో వీటిని మేనేజ్ చేయవచ్చని తెలిపారు. ఐతే మనిషి శరీరంలో ఎంతకాలం ఇది పనిచేస్తున్నదనేది మరిన్ని ప్రయోగాల తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ వాక్సిన్ ని ఇండియాలో పంపిణీ చెయ్యడానికి పూణే కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.