ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నాలుగు కరోనా కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది. కరోనా బాధితులలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉండడటం మాములు విషయం కాదు. దీనితో గవర్నర్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి. అసలు రాజ్ భవన్ లోకి ఈ వైరస్ ఎలా వచ్చిందని అంతటా చర్చజరుగుతోంది.
ఈ క్రమంలో సరిగా రెండు వారాల క్రితం కొత్తగా నియమితులైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీ కనగరాజ్ గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… రాష్ట్ర ప్రభుత్వం చే హడావిడిగా నియమింపడిన ఆయన లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి చెన్నై నుండి విజయవాడ వచ్చి హడావిడిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇప్పుడు ఆయన వల్లే కరోనా రాజ్ భవన్ కు వచ్చిందేమో అని ప్రతిపక్షాల ఆరోపణ. రాజ్భవన్లో కరోనా వ్యాప్తికి చెన్నై నుంచి వచ్చిన కనగరాజే కారణం అనడం దారుణం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు మీడియా ముందు వాపోతున్నారు. అయితే ఆ ఆరోపణకు ఆస్కారం ఇచ్చింది ప్రభుత్వమే కదా?
కేవలం ఈగోకి పోయి ఇటువంటి సమయంలో పక్క రాష్ట్రం నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రధాన ఎన్నికల అధికారిని మార్చడం అవసరమా? ఇది ఇలా ఉండగా… వారం రోజులగా ఆంధ్రప్రదేశ్ లో కేసుల ఉదృతి పెరుగుతుంది. గత 24 గంటల్లో 80 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటితో రాష్ట్రంలోని మొత్తం కేసులు 1,177కు చేరాయి. కొత్త కేసులలో 33 కేసులు కృష్ణ జిల్లాకు చెందినవి, మరో 23 గుంటూరుకు చెందినవి, 13 కేసులు కర్నూలుకు చెందినవి.