ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుటుంబానికి మరింత షాక్ తగిలే అవకాశాలున్నాయి. 2జీ కుంభకోణానికి సంబంధించి ఎయిర్ సెల్- మ్యాక్సిస్ ఒప్పందంలో చిదంబరం కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కార్తీ చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇదివరకే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సదరు సమన్ల ప్రకారం కార్తీ చిదంబరం బుధవారం నాడు ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈడీ సమన్లను కార్తీ బేఖాతరు చేస్తూ విచారణకు డుమ్మా కొట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈడీ అధికారులు కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఏ క్షణంలోనైనా ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇదే జరిగితే… చిదంబరం కుటుంబం మరిన్ని చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి.