tamanna-bhatia-vishalఎరక్కబోయి వచ్చాను… ఇరుక్కుపోయాను… అన్నట్లుంది మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి. దీనికి కారణం ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన త్రిభాషా చిత్రం “దేవి” ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడమే. ఇటీవల తమన్నా, విజయ్‌ సేతుపతి జంటగా నటించిన ‘ధర్మదురై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమన్నా ఎలాంటి మొహమాటం లేకుండా ‘నో’ చెప్పింది.

దీంతో దర్శకనిర్మాతలే ఆ బాధ్యతను భుజానికెత్తుకుని ఎలాగోలా ప్రమోషన్ కార్యక్రమాలను ‘మమ’ అనిపించారు. కానీ, తాజాగా ఈ పాల బుగ్గల సుందరి తాను నటించిన ‘దేవి’ సినిమా ప్రమోషన్‌లో విపరీతంగా పాల్గొంటోంది. దీంతో తమ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనడానికి ‘నో’ చెప్పిన తమన్నా, దేవి ప్రమోషన్‌లో పాల్గొంటుండడంపై ‘ధర్మదురై’ చిత్ర నిర్మాత సురేష్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

అంతటితో ఆగకుండా మిల్కీ బ్యూటీపై ఏకంగా నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్‌కు ఫిర్యాదు చేశాడు. ఇక్కడి వరకు రసవత్తరంగానే సాగిన ఎపిసోడ్ లో… ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా తన తదుపరి చిత్రాన్ని విశాల్‌ తోనే చేస్తోంది. ఈ నేపథ్యంలో సురేష్ ఫిర్యాదుపై విశాల్ ఏ విధంగా స్పందిస్తాడన్నది కోలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎటు వైపుకు విశాల్ మొగ్గుచూపుతారోనని సినీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.