వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వం మీద యాక్టీవ్ గా విమర్శలు చేసి జగన్ దృష్టిలో పడి ఎస్వీబీసి ఛైర్మన్ పదవి సంపాదించారు నటుడు పృథ్వి. ఇటీవలే అమరావతి రైతుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు ఆయన. ధార్మిక పదవిలో ఉండి కూడా రాజకీయాలు మాట్లాడటం ఏంటి అని ఆయన మీద విమర్శలు వచ్చాయి.
అయితే ఇప్పుడు మరింత దారుణంగా ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన విషయాలకు సంబంధించిన ఆడియో టేపులను బహిర్గతం అయ్యింది. ఆ టేపులో ఉన్న సమాచారం మేరకు ఆయన తిరుమల శ్రీవారికి చెందిన పద్మావతీ గెస్ట్ హౌస్ లో యువతులను లోబర్చుకుంటారని తేటతెల్లం అయ్యింది.
దీనితో ఆయన మీద ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయనను పదవి నుండి తొలగించాలని ఉద్యోగ సంఘాల వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆయన 36 మంది ఉద్యోగులను ఇష్టానుసారం నియమించి, డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ విషయం తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి తెలిసి పృథ్వీరాజ్ను మందలించడంతో 30 మందిని తొలగించారని చెప్పారు.
పృథ్వీరాజ్ రాసలీల వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. వెంటనే ఆయనని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ తిరుమల విషయంలో అనేక వివాదాలు వస్తున్నాయి. ఇది సెన్సిటివ్ విషయం కావడంతో జగన్ కూడా ఒకింత జాగ్రత్త గానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు పృథ్వి విషయంలో ఏం చెయ్యబోతున్నారో చూడాలి. ఆయనను తప్పించకపోతే అది అప్రతిష్టే.