ప్రస్తుతం తెలుగు నాట వెండితెరపై నవ్వులు పండిస్తున్న వారిలో ’30 ఇయర్స్ పృధ్వీ’ ఒకరు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న పృధ్వీ, తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ షూటింగ్ సమయంలో పృధ్వీకి ఓ ప్రమాదం చోటు చేసుకుని, గాయాల పాలయ్యారు.
షూటింగ్ లో భాగంగా రోప్ షాట్ చిత్రీకరిస్తున్న సమయంలో జారిపడ్డ పృధ్వీ, స్వల్ప గాయాలయ్యాయట. దీంతో షాక్ తిన్న చిత్ర యూనిట్, పృథ్వీని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. పృథ్వీని పరీక్షించిన వైద్యులు మేజర్ గాయాలేమీ కాలేదని తేల్చారు. అలాగే పృథ్వీ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
దీనిపై స్పందించిన పృధ్వీ, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, తన ఆరోగ్యం మెరుగుపడాలని చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఫోటోలలో పృధ్వీ బాగానే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంతగానో కష్టపడితేనే పృధ్వీ ఈ స్థాయికి వచ్చాడని, ఇటీవలే బుల్లితెరపై ఓ కార్యక్రమంలో ‘ప్రభాస్’ శ్రీను ప్రశంసలు కురిపించారు.