ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే టాలీవుడ్ సినీ యాక్టర్ ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ తెలుగుదేశం పార్టీపై సెటైర్లు ప్రారంభించాడు. ‘నేను 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’ అని సినిమాలు చేసుకుంటుంటే, ’40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’ అంటూ పాలిటిక్స్ కొందరు చేసుకుంటున్నారని, పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ సెటైర్లు వేశారు.
నెల్లూరు జిల్లాలో వీఆర్సీ మైదానంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న పృధ్వీ మాట్లాడుతూ… 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ఆయనకు, 40 ఏళ్ల వయసున్న జగన్ చూసి ఎందుకంత భయమని ప్రశ్నించారు. తనకు చంద్రబాబు పేరెత్తడం కూడా ఇష్టం లేదని, ఆ పేరు తన నోటి నుంచి రావట్లేదని, జగన్ ను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయమో చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ తరపున సీటు లభిస్తుందన్న ఉత్సాహంలో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు గానీ, ఇంతకీ జగన్ వర్యులు పృధ్వీ గారికి టికెట్ ఖరారు చేసినట్లుగా అయితే సమాచారం లేదు. గత ఎన్నికలలో కూడా ఇలాగే చాలామంది టికెట్ వస్తుందన్న ఆశాభావంతో విమర్శలు చేయగా, చివరికి జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో, నాలుక కరుచుకుని టిడిపి పక్షాన చేరిన వారి గురించి 30 ఇయర్స్ గారికి తెలుసో లేదో మరి?!