Comedian Prudhvi marriage controversy‘బత్తాయి బాబ్జీ – కాయ నలగకుండా, తొక్క తీయకుండా రసం పిండేస్తా’ వంటి డైలాగ్స్ తో కామెడీని పండించే ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అవును… ప్రొఫెషనల్ గా అద్భుతంగా రాణిస్తున్న పృధ్వీ వ్యక్తిగత జీవితం మాత్రం ఇటీవల హాట్ టాపిక్ అయ్యింది. భార్యతో తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో… నమోదైన కేసులో తాజాగా తుది తీర్పు వెలువడడంతో మరోసారి పృధ్వీ పేరు హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది.

1984వ సంవత్సరంలో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్న బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ శేషు అలియాస్ మూర్తి జంటకు ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే నటనపై ఆసక్తితో తరచూ చెన్నైకి వెళుతూ, ఒక్కో అవకాశాన్నీ అందుకుంటున్న తరుణంలో తమ కాపురాన్ని హైదరాబాద్ కు మార్చారు. అయితే ఆపై తరచుగా భార్యతో గొడవలు తలెత్తడంతో, గత సంవత్సరం వీరిద్దరూ విడిపోయారు.

పెద్ద మనుషుల మధ్య రాజీకి ప్రయత్నించినా పృథ్వీ పట్టించుకోలేదన్న నెపంతో, సతీమణి శ్రీలక్ష్మి నవంబర్ లో పోలీసు కేసు పెడుతూ, తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉందని నెలకు 10 లక్షలు భరణం ఇప్పించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు వేయగా, విచారణ చేసిన న్యాయస్థానం బాధితురాలికి నెలకు 8 లక్షలు భరణం కింద ఇవ్వాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు అంతిమ తీర్పును ఇచ్చింది. దీంతో ‘బత్తాయి బాబ్జీ’లో అసలు రసం పిండేయడం అంటే ఇదేనేమో… అంటున్నారు నెటిజన్లు.