తెలుగు సినిమా ఇండస్ట్రీ పై తెలుగు ప్రేక్షకుల పై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా బ్రేక్ కారణంగా ఆయన గత కొన్ని నెలలుగా గుంటూరులోని తన ఇంట్లోనే ఉంటున్నారు.
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం.. సిరివెల్ల గ్రామంలో జన్మించిన ఆయన… గుంటూరులో నాటకాలు ఆడేవారు. షూటింగులు లేని రోజులలోకూడా అక్కడకు వెళ్లి నటించేవారు. దానితో గుంటూరులోనే సెటిల్ అయ్యారు. 988లో ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాతో నటుడిగా ఆయన నటుడిగా రంగ ప్రవేశం చేశారు. మొదట్లో చిన్నా చితకా పాత్రలే వచ్చాయి.
1997లో వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమాలో ఫ్యాక్షనిస్టు పాత్ర చేసి తన మొదటి బ్రేక్ సాధించారు. ఆ తరువాతి సంవత్సరం విడుదలైన సమరసింహా రెడ్డిలోని అటువంటి పాత్రే చేశారు. అప్పటి నుండి ఆయన వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతూ ఆయన చెప్పిన డైలాగ్స్ పాపులర్ అయ్యాయి.
విలన్ పాత్రలే కాకుండా శ్రీను వైట్ల, దర్శకుడు వంశీ వంటి వారి సినిమాలలో కామెడీ పాత్రలలో కూడా ఆయన మెరిశారు. పెద్ద తెర మీద ఆయన కనిపించిన చివరి సినిమా… మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అనడంలో ఎటువంటి సందేహం లేదు.