ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల పందేరం వేగం పంచుకుంది. ఎన్నికల ముందు తనకు మద్దతు ఇచ్చిన వారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఇప్పటికే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా నియమించారు జగన్. ఆయన ఛార్జ్ కూడా తీసుకున్నారు. మరోవైపు ఎన్నికల ముందు తనకు మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన కమెడియన్ అలీకి కూడా కీలక పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
ఆయనను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నారని అధికార ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న అలీ… ఎన్నికలకు ముందు మొదట జనసేనలో చేరతారని అంతా భావించారు. ఆ తరువాత అలీ టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారనే టాక్ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో అలీ సమావేశం కూడా అయ్యారు.
ఆయనకు గుంటూరు ఈస్ట్ టికెట్ ఖాయమైందనే ప్రచారం కూడా సాగింది. కానీ టీడీపీ, జనసేనలకు షాక్ ఇచ్చిన అలీ… చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మంత్రి కావాలన్నది తన కల అని అప్పట్లో చెప్పిన అలీకి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం రాలేదు. ఆ పార్టీ తరపున అలీ ఇటీవలే ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో విరివిగా ప్రచారం చేశారు. ఇప్పుడు దానికి తగిన ప్రతిఫలం పొందారు.