తెలంగాణలో రైతు సమస్వయ సమితుల ఏర్పాటు తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధించుకున్న తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. టిఆర్ఎస్ పార్టీ వారే రైతు సమన్వయ సమితులలో ఉంటారని ఆయన చెప్పడం అభ్యంతరకరం. 14 ఏళ్ళు తెలంగాణ కోసం కష్టపడింది వారే కాబట్టి పదవులు అనుభవించే హక్కు కూడా వారికే ఉందని కేసీఆర్ చెప్పుకోచించారు.
సాదారణంగా ఇలాంటి కమిటీలలో ఎవరు అదికారంలో ఉంటే వారి పార్టీవారే ఎక్కువగా ఉంటారు. అలాగని దానిని ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేత సమర్దించడం సరికాదు. ఆయన తెరాస నాయకులకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు. పోనీ కేసీఆర్ చెప్పిందే నిజం అనుకుందాం. తెలంగాణ కోసం కష్టపడింది తెరాస వారే అయితే తుమ్మల, తలసాని లాంటి వారికి మంత్రి పదవులు ఎక్కడ నుండి వచ్చాయి?
ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేస్తుండంగా ఆయన వెనుక కూర్చున్న వీరు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు కాదా గతంలో. మరి వారికి ఉన్న అర్హతలు ఏమిటి? వచ్చే ఏడాది రైతులకు ఎకరాలకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు విడతల గా ఇప్పించడంలో ఈ రైతు సమితులు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ప్రభుత్వమే చెబుతోంది.
రాజకీయ కోణంలో ఏర్పాటు అయ్యే ఈ కమిటీలు ఏ రకంగా ప్రజలు న్యాయం చేస్తాయి. టీడీపీ వారికి, కాంగ్రెస్ వారికి ఆ సొమ్ములు ఇవ్వొద్దని కేసీఆర్ డైరెక్ట్ గా చూపినట్టు కాదా? అయితే దురదృష్టవశాత్తు ఇంత దారుణమైన స్టేట్మెంటును సమర్థవంతంగా ఖండించే స్థితిలో కూడా లేదు ప్రతిపక్షం.