RRR - Movie Annapurna Theatreచాలాకాలం తర్వాత ఇద్దరు పెద్ద హీరోలు నటించిన మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” మరో నాలుగు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ ను తాకబోతోంది. ఈ సునామీ ఏ విధంగా ఉంటుందో ఎవరి అంచనాలకు అందని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ స్థాయిలో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, ఓపెనింగ్ రికార్డులు మునుపెన్నడూ చవిచూడని రీతిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు కూడా అంచనాలు వేస్తున్నాయి. పెరిగిన టికెట్ ధరలను ప్రేక్షకులు పట్టించుకునే విధంగా లేరని ఈ ఓపెనింగ్స్ చెప్పకనే చెప్తున్నాయి.

ఇదిలా ఉంటే, “ఆర్ఆర్ఆర్” వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం విజయవాడ అన్నపూర్ణ ధియేటర్ యాజమాన్యం ఓ స్పెషల్ ట్రీట్మెంట్ ను సిద్ధం చేసింది. ‘ఆనందం’ సినిమాలో ఎం.ఎస్.నారాయణ గాజు పెంకులపై డ్యాన్స్ వేసినట్లు, సిల్వర్ స్క్రీన్ పై తమ అభిమాన హీరోలను చూడడానికి విచ్చేసే ఫ్యాన్స్ కోసం చక్క చైనా మేకులు దిగ్గొట్టి మరీ స్క్రీన్ దగ్గర పెట్టారు.

దీంతో స్క్రీన్ దగ్గరికి వెళ్లే సాహాసాన్ని ఫ్యాన్స్ ఎవరూ చేయలేరు. మల్టీస్టారర్ గనుక, ఏ హీరో ఫ్యాన్స్ అయినా నిరుత్సాహ పడినా స్క్రీన్లను చించేసిన ఘనచరిత్ర మన తెలుగు హీరోల ఫ్యాన్స్ కు ఉంది. బహుశా ఆ ఉద్దేశంతోనే స్క్రీన్ దగ్గరకు ఫ్యాన్స్ చేరకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారో ఏమో గానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సహజంగా సింగిల్ స్క్రీన్స్ లో అభిమానుల రచ్చ మాములుగా ఉండదు. ముందు సీట్లల్లో ఉన్న వారందరూ ఎక్కువగా స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి డ్యాన్స్ లు చేస్తుంటారు. “ఆర్ఆర్ఆర్” సినిమాకు అయితే విజయవాడ అన్నపూర్ణ ధియేటర్ లో ఈ అవకాశం లభించినట్లే. రెండవ రోజు నుండి ఇప్పటికే ఈ ధియేటర్ ఓపెనింగ్స్ ప్రారంభమయ్యాయి.

అయితే ఇలా వేయడంపై అభిమానులు ఒకింత ఆగ్రహంతోనే ఉన్నారు. స్క్రీన్ కాకపోతే సీట్లు అయినా చించేస్తారు జాగ్రత్త పడండి అన్న సూచనలు వస్తున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలాంటి పోకడ చూడకపోగా, బెజవాడలో ప్రారంభమైన ఈ ట్రెండ్ ను మరికొంతమంది ధియేటర్ యాజమాన్యం కూడా పాటించే అవకాశాలు లేకపోలేదన్నది ట్రేడ్ టాక్.

RRR1

RRR2