తిరుమల తిరుపతి దేవస్థానం ఛైౖర్మన్ పదవికి ఒంగోలు మాజీ ఎంపీ, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన రాష్ట్రమంత్రివర్గ మొట్టమొదటి సమావేశం తర్వాత అత్యవసర ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలిని రద్దు చేసి, నూతన పాలకమండలిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాతే అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే దీని మీద ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది.
వైవీ సుబ్బారెడ్డి విజయమ్మ చెల్లెలి భర్త. విజయమ్మకు క్రిస్టియానిటీ పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. కావున వైవీ సుబ్బారెడ్డి కూడా అదే మతస్థుడని పలువురి వాదన. అన్యమతస్తుడిని టీటీడీ ఛైర్మన్ గా నియమించడం అంటే తిరుమలలో మతప్రచారాన్ని ప్రోత్సహించినట్టే అని పలువురి వాదన. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు మాత్రం వైఎస్ కుటుంబం క్రిస్టియన్ అయినా వైవీ సుబ్బారెడ్డి కుటుంబ హిందువు మతం లోనే ఉందని చెబుతున్నారు.
దీనిలో నిజానిజాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇటువంటి సమయంలో అనవసర వివాదాలు అవసరమా అనేది జగన్ ఆలోచించుకోవాలి. గతంలో వైఎస్ అప్పుడు కూడా తిరుమల విషయంలో చాలా వివాదాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా టీటీడీ పదవిపై సుబ్బారెడ్డి మొదటి నుంచీ ఆసక్తి చూపడం లేదు. ఆయన రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. అయితే ఇతరులకిచ్చిన హామీలుండడంతో రెండేళ్ల వరకూ సుబ్బారెడ్డికి ఇవ్వడం కుదరదని అందువల్లే ఇప్పుడు టీటీడీ ఛైర్మన్గా వెళ్తే, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చేందుకు హామీ ఇవ్వడంతో వైవీ అంగీకరించినట్లు తెలిసింది.