తమ్ముడు పవన్ ను రాజకీయంగా ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు అన్నయ్య చిరంజీవి. ఇటీవలే ఒక ఆగంతకుడి కత్తి వేటుకు గాయపడిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అయితే జగన్ ను పరామర్సించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పవన్, జగన్ బీజేపీ ఆడినట్టు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
అయితే ఈ మధ్య కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కూడా పవనే ఫాలో అయ్యారు. జగన్ ను ఈరోజు మధ్యాహ్నం చిరంజీవి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు వైఎస్ జగన్ నిన్న ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే.
ఆయనకు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు ఈరోజు మరోసారి పరీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఇప్పటికే జగన్ తన పాదయాత్రకు విరామం ప్రకటించి తన లోటస్ పాండ్ ఇంట్లో రెండు రోజులుగా రెస్టు తీసుకుంటున్నారు. ఒక వారం రోజులకు అటూ ఇటూగా పాదయాత్రను తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉంది.