మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా ‘కత్తి’ రీమేక్ అన్న ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం చిత్ర తారాగణం ఎంపికపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గా చిరు సరసన నయనతారను గానీ, మిల్కీ బ్యూటీ తమన్నాను గానీ పరిశీలిస్తున్నారట. నయనతారతో దర్శకుడు వి.వి.వినాయక్ ఇప్పటికే ‘యోగి, అదుర్స్’ చిత్రాలకు పని చేయగా, తమన్నాతో ‘బద్రీనాథ్, అల్లుడు శీను’ సినిమాలు చేసారు. అయితే, ఫైనల్ గా సీన్ లోకి ఎవరు వస్తారనేది ప్రశ్నార్ధకమే!
ఇక, విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘రక్త చరిత్ర’ వివేక్ ఓబరాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. దాదాపుగా వివేక్ కూడా ఓకే చేసినట్టు సమాచారం. అలాగే సాంకేతిక తారాగణం ఎంపికలో కూడా దర్శకుడు వినాయక్, నిర్మాత రామ్ చరణ్ లు నిమగ్నమయ్యారని ట్రేడ్ టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన 2016, జనవరి సంక్రాంతి పర్వదినాన ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద 150వ సినిమాకు సంబంధించిన ప్రకటన రాగానే, మెగా క్యాంప్ దూకుడు మీదుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.