జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలను తూర్పారపడుతూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడి 24 గంటలు కూడా గడవాక ముందే మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న రాజకీయ ఎత్తుగడ పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. ప్రజాసేవ చేయడానికి ‘కులం’ ఏంటి? తనకు కులం అంటగడితే ఊరుకోను… అంటూ తీవ్రస్థాయిలో మండిపడిన పవన్ కళ్యాణ్, విభజన సమయంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలనైతే ఒక రేంజ్ లో ఆడుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా తన అన్న చిరంజీవి పేరు ఎత్తకపోయినా… అప్పటి కాంగ్రెస్ ఎంపీలంతా ‘మేడం… ప్లీజ్ ప్లీజ్…’ అంటూ యాచకుల్లా వ్యవహరించిన తీరును ఏకిపారేసిన వైనం ప్రజలకు బాగా నచ్చింది.
అలాగే ‘ఆవులను’ అడ్డం పెట్టుకుని బిజెపి చేస్తున్న రాజకీయాలను కూడా ఏకిపారేసిన పవన్, రాజకీయాలలో ‘కులమతాలు’ ఉండరాదని పిలుపునిచ్చారు. తన కంటే వయసులో చిన్నవాడైనా… పవన్ చేసిన వ్యాఖ్యలను చూసైనా చిరంజీవి రాజకీయ వైఖరిలో మార్పు వస్తుందని భావించిన అభిమానులకు షాక్ నిస్తూ, ఆదివారం నాడు ‘కాపు ఉద్యమ నేత’ ముద్రగడ పద్మనాభంతో భేటీకి సిద్ధమయ్యారు. ఓ పక్కన తమ్ముడు ‘కులాల చిచ్చు’ వద్దని పిలుపునిస్తుంటే… మరొక పక్క అన్నయ్య ‘కుల రాజకీయాల’కు ప్రాధాన్యతనిస్తూ కాలం వెలిబుచ్చుతున్నారు.
పవన్ ను చూసిన తర్వాతైనా కళ్ళు తెరవండి అంటూ ప్రజానీకం, రాజకీయ విశ్లేషకులు చిరంజీవిపై విమర్శలు చేస్తున్న నేపధ్యంలో… ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చే విధంగా, ముద్రగడతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా హీరోగా ఉన్నపుడు కులానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వని చిరంజీవి నిజ వైఖరి, ఇప్పుడు బయట పడుతోందంటూ విమర్శల వర్షం కురుస్తోంది. ఒక రకంగా రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చిరంజీవి చేస్తున్నారంటూ ‘జనసేన’ అభిమానగణం మండిపడుతోంది.