జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. పవన్తో పాటు ఆయన తల్లి, ఆయన సోదరుడు నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు మరికొందరు సినీప్రముఖులు ఫిలిం ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ‘మా’ అసోసియేషన్, నిర్మాతల మండలిని పవన్ ప్రశ్నించారు.
శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని రామ్గోపాల్ వర్మ ప్రకటించడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. తనకు న్యాయం జరిగే వరకు ఫిలిం ఛాంబర్ వదిలి వెళ్లేది లేదని పవన్ స్పష్టం చేశారు. మరోవైపు చిరంజీవి కూడా ఛాంబర్ కు వస్తారని విరివిగా ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ జరగలేదు.
కాసేపటి క్రితం ఛాంబర్ బయట గుమ్మికూడిన అభిమానులకు అభివాదం చేస్తూ ఫిల్మ్ ఛాంబర్ నుంచి పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. అంతకు ముందు సినీ పెద్దలు ఆయనకు నచ్చచెప్పినట్టు సమాచారం. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ మీద యాక్షన్ తీసుకుంటామని ఆయనకు నచ్చచెప్పి పంపినట్టు సమాచారం.