Chiranjeevi No to Lucifer remakeమెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ రైట్స్ కొన్నారని వార్తలు వచ్చాయో అప్పుడే మెగా ఫ్యాన్స్ లో గుబులు మొదలయ్యింది. పైగా దానికి సాహో వంటి డిజాస్టర్ సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్ దర్శకుడు అంటే వారు మరింత ఆందోళన చేశారు. అయితే చిరంజీవి ఇప్పటికే సుజీత్ తో మూడు నెలలు ట్రావెల్ చేసి, స్క్రిప్ట్ వర్క్ చేశారు.

అయితే తాజాగా ఈరోజు వినిపించిన వార్త ఏమిటంటే… చిరంజీవికి స్క్రిప్ట్ నచ్చలేదట. దానితో ఇది పక్కన పెట్టేద్దాం అని సుజీత్ కి తేల్చి చెప్పేశారట. హమ్మయ్య అని ఆనందించేలోగానే మెగా ఫ్యాన్స్ కు ఇంకో బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఈ ప్రాజెక్టు స్థానంలో చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఇంకో సినిమా చెయ్యబోతున్నారట.

బాబీ బాగా ఎక్కువ అనుకుంటే యావరేజ్ ఇవ్వగలిగే దర్శకుడు. ఏదో తీశాడు అంటే తీశాడు అనే సినిమాలు అంతే… మెగాస్టార్ సినిమాల కుండే అంచనాలను ఆయన ఏ మాత్రం అందుకోలేదని అభిమానులు మదనపడుతున్నారు. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉంది అంటి సోషల్ మీడియాలో అనుకుంటున్నారు.

కరోనా పరిస్థితులు కొంచెం చక్కబడ్డాకా చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి చేస్తారు. ఆ సినిమా 2021 వేసవికి గానీ విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. బాబీ సినిమా 2021 రెండో భాగంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు అని వార్తలు వస్తున్నాయి.