Chiranjeevi - Mahesh Babuమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీరాజా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘మా’ కంటూ ఓ భవనం ఉండాలని ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు గానూ టాలీవుడ్ లోని అందరి సహకారం తీసుకుంటామని చెప్పిన శివాజీ, దీనికి సంబంధించి తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ‘మా’ భవన నిర్మాణ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.

చిరంజీవి గారు ఎంత మంచి వారో ఈ సందర్భంగా ప్రస్తావించాలని, జరిగిన విషయం మొత్తాన్ని శివాజీ చెప్పారు. ముందుగా మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్లి, మీరు అమెరికా వచ్చి ఓ రెండు కార్యక్రమాలతో పాల్గొంటే ఫండ్స్ చాలా పెద్ద మొత్తంలో వస్తాయని చెప్పగా, ‘సైరా’ షెడ్యూల్స్ ఉన్నాయని చిరు అన్నారని, సరే ముందుగా ఓ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రెండో కార్యక్రమం కోసం మళ్ళీ అమెరికా వస్తానని చెప్పారని, అంత మంచితనం చిరు సొంతమని చెప్పిన శివాజీ, ఓ కార్యక్రమానికి రండి చాలు అని చెప్పామని తెలిపారు.

ఇక మహేష్ బాబు దగ్గరికి కొంతమంది వెళ్లి అడగగా, ఇప్పటికే నాన్న గారు చెప్పారని అన్న మహేష్, తప్పకుండా వస్తాను, మే నెలలో ప్లాన్ చేసుకోమని చెప్పారని, వీరిద్దరి సహకారం మరువలేనిదని, మా భవనంలో వీరిద్దరికి ప్రత్యేక వింగ్స్ పెట్టి, వాటికి వీరిద్దరి పేర్లు పెడతామని శివాజీ స్పష్టం చేసారు. టాలీవుడ్ ఉన్నన్నాళ్ళు ఉండిపోయే ‘మా’ భవనంలో చిరు, మహేష్ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోవడం… ఇద్దరి హీరోల అభిమానులకు గర్వకారణమే కదా..! అయితే ఈ భవనం పూర్తయ్యే పాటికి ఎన్ని విభేదాలు తలెత్తుతాయో అన్న టాక్ కూడా వినపడుతోంది.