chiranjeevi-mahesh-babu-prabhas-rajamouli-kratala-siva-to-meet-jaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి బేగంపేట్ విమానాశ్రయం నుండి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్ లతో పాటు ప్రముఖ దర్శకులు రాజమౌళి మరియు కొరటాల శివలు ఫ్లైట్ ఎక్కిన విషయం తెలిసిందే.

సహజంగా వీరందరూ ఒకే దగ్గర కనిపించరు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీపై నెలకొన్న పరిస్థితుల రీత్యా జగన్ ను కలవడానికి అందరూ కలిసి ఒకే విమానంలో ఎక్కగా, లోపల వీరంతా అసలు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏమేమి మాట్లాడుకుంటున్నారు? అన్న ఉత్సుకత కలగడం అభిమానులకు సహజమే.

ఈ ప్రశ్నలలో కొంతభాగాన్ని అయితే మెగాస్టార్ చిరంజీవి రివీల్ చేసారు. ఫ్లైట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుష్పగుచ్ఛాన్ని అందించి ‘చిరంజీవి అండ్ కో’ శుభాకాంక్షలు తెలిపారు. నేడు మహేష్ – నమ్రతల 17వ ఏడాది పెళ్లి రోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ కెమెరాకు క్లిక్ మనిపించారు.

ఈ ఫోటోను మెగాస్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… మరోసారి సూపర్ స్టార్ – నమ్రతలు ఇద్దరూ జీవితకాలం ప్రేమ, ఆప్యాయతలతో జీవించాలని అభిలషించారు. అంతకుముందు మహేష్ కూడా తన ఇద్దరు పిల్లలతో కూడిన ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

చిరంజీవి పోస్ట్ చేసిన ఈ ఫోటోలో ఉన్న విశేషం ఏమిటంటే… సోదరుడు రమేష్ అకాల మరణం తర్వాత మహేష్ బాబు ముఖకవళికలు స్పష్టంగా కనపడుతూ దిగిన ఫోటో ఇదే. అప్పటినుండి మీడియాకు దూరంగా ఉన్న సూపర్ స్టార్, రమేష్ కర్మకాండల కార్యక్రమంలో కూడా మాస్క్ తో సైడ్ నుండే కనిపించిన వైనం తెలిసిందే.