‘భరత్ అనే నేను’ అందించిన భారీ విజయం దర్శకుడిగా కొరటాల శివ స్థాయిని మరింత పెంచింది. దాంతో ఆయన తదుపరి ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుంది? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ మూవీ చిరంజీవితో వుంటుందనే వార్త బయటికి వచ్చింది. ‘సైరా’ తరువాత చిరంజీవి .. కొరటాలతోనే సెట్స్ పైకి వెళ్లనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
ఈ కాంబినేషన్ ను సెట్ చేసింది పవన్ కల్యాణ్ అనేది అసలు హాట్ న్యూస్. ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసిన కొరటాల, సందేశంతో కూడిన ఒక కథను ఆయనకి వినిపించాడట. రాజకీయాలతో తాను బిజీగా ఉన్నాననీ, ఈ కథను అన్నయ్యతో చేస్తే బాగుంటుందని ఆయన దగ్గరికి కొరటాలను పవన్ పంపించాడట. ఆ కథను విన్న వెంటనే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట, అలా ఈ కాంబినేషన్ సెట్ అయింది.
బన్నీతో కొరటాల సినిమా వుండవచ్చని అందరూ అనుకుంటోన్న సమయంలో, ఏకంగా చిరంజీవితోనే కలిసి కొరటాల రంగంలోకి దిగుతుండటం విశేషం. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నాయో గానీ, సినీ జనాల్లో మాత్రం ఇది హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే మెగా ఫ్యాన్స్ కు పవర్ స్టార్ అతిపెద్ద ఫేవర్ చేరిన వారవుతారు.