మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలో దెబ్బ తిన్నాకా సినిమాలలోకి తిరిగి వచ్చారు. ఇప్పటివరకు రెండు సినిమాలు చేశారు. మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150తో 100 కోట్ల సినిమా చెయ్యగా, రెండో సినిమా సైరా తో అంతా మెచ్చుకునే సినిమా తీశారు. తాజాగా కొరటాల శివతో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
సైరా, కొరటాల సినిమాల గురించి చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో లోని విశేషాలు చెప్పారు. “సైరా’ సినిమాకి 4.30కి లేచి వర్కవుట్ చేసుకొని 5.30గంటలకల్లా రెడీ అయ్యి 6 గంటలకు లొకేషన్కి వెళ్లి 7 గంటలకల్లా మేకప్తో రెడీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ షార్ప్ 7కల్లా స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 2న షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే ఓ సాంగ్, మూడు ఫైట్స్ కంప్లీట్ అయ్యాయి,” అని చెప్పుకొచ్చారు.
ఈ వయసులో కూడా చిరంజీవి ఇంతటి నిబద్దతతో షూటింగ్ చెయ్యడం అంటే మాటలు కాదు… బహుశా ఆ నిబద్ధతే చిరంజీవిని మెగాస్టార్ ని చేసి ఉంటుంది. ఇది ఇలా ఉండగా కొరటాల సినిమాని ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు నిర్మాతలు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాది వేసవి వరకు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. తొందరలో ఆమె సినిమాలోకి ఎంటర్ అవుతుంది. మణి శర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు.