ఎపిలో పాలనా వికేంద్రీకరణను స్వాగతిస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి, నటుడు చిరంజీవి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడదల చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక, అసమానతలు తొలగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషిచేస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు.
ఇప్పటికే రూ. మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ. లక్షకోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలోనూ ఉందన్నారు. అయితే ఈ ప్రకటన మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కారణం చిరంజీవి తీసుకున్న స్టాండ్ జనసేనకు వ్యతిరేకంగా ఉండడమే.
దీనివల్ల జనసేనకు రాజకీయంగా నష్టమని చాలా మంది అభిప్రాయపడ్డారు. జనసైనికులు కూడా దీని మీద విరుచుకుపడుతున్నారు. ఈ తరుణంలో అసలు ఆ ప్రకటన నిజమైనది కాదని, వైఎస్సార్ కాంగ్రెస్ సృష్టి అని కొందరు చిరంజీవి అభిమానులు కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అన్ని ప్రముఖ మీడియాలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి.
పైగా నిన్న సాయంత్రమే అనేక ఛానెల్స్ ఈ విషయంగా చర్చా కార్యక్రమాలు జరిపాయి. ఒకవేళ అబద్దమైతే చిరంజీవి వర్గం నుండి ఖండన వచ్చే ఉండేది. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. ఈ ప్రయత్నం చేస్తున్న అభిమానులు కూడా చిరంజీవి ప్రకటన తప్పే అనుకుంటూ ఆ తప్పు ఆయన చెయ్యలేదు అని చెప్పే ప్రయత్నం చెయ్యడం విశేషం.