Chiranjeevi Coronavirus - Acharya movie shooting stoppedఇప్పుడిప్పుడే చలన చిత్ర పరిశ్రమ గాడిలో పడుతుంది అనుకుంటుండగా మరో షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. కాసేపటి క్రితం ఆయనే దానిని స్వయంగా నిర్థారించారు. ఈరోజు ఆయన తన తదుపరి చిత్రం ‘ఆచార్య’ మొదలుపెట్టాల్సి ఉండగా షూటింగ్ ఇప్పుడు మరోసారి ఆగిపోయింది.

“ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను,” అని చిరంజీవి ట్విట్టర్ లో తెలిపారు.

చిరంజీవి చివరిసారిగా శనివారం పబ్లిక్ లో కనిపించారు. ఆరోజు మధ్యాహ్నం ఆయన నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. అదే రోజు సాయంత్రం ఆయన రఘు కుంచె కుమార్తె వివాహానికి హాజరయ్యారు. రెండు సందర్భాలలోనూ ఆయన మాస్కు లేకుండానే కనిపించారు.

దీనితో రెండు సందర్భాలలో ఆయన తో కాంటాక్ట్ లోకి వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు, సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి ఆవశ్యకతని ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాలి.