Chiranjeevi Amaravati Three Capitals Jaganప్రజారాజ్యం తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమై తన గత సినీ జీవితాన్ని పునఃప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, వరుస సినిమాలతో బిజీగా ఉన్న వైనం మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని పంచింది.

త్వరలో “ఆచార్య” రూపంలో ప్రేక్షకులను పలకరించనున్న మెగాస్టార్ గారు మూడు రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న తాజా నిర్ణయంపై స్పందించాల్సిన ఆవశ్యకత ఉందన్న అంశాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

నాడు మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ సీఎం ప్రకటించిన సమయంలో మీడియా ముందుకు వచ్చిన మెగాస్టార్, వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ ద్వారా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, చిరంజీవి మాత్రం బహిరంగంగానే జగన్ కు మద్దతు పలికారు.

రాజకీయాలకు దూరంగా ఉంటూనే జగన్ తీసుకున్న నిర్ణయంపై అప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మరి ఆ నిర్ణయాన్ని స్వయంగా జగనే వెనక్కి తీసుకున్నారు గనుక, మెగాస్టార్ గారు కూడా తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటారా? ప్రస్తుతం ఎందుకు మౌనంగా వహిస్తున్నారనేది నెటిజన్ల ప్రశ్న.

‘అద్భుతం’ సినిమా బాగుందంటూ ట్వీట్ వేసిన మెగాస్టార్, మీడియా ముందుకు రాకపోయినా, కనీసం ట్విట్టర్ వేదికగా అయినా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారేమోనని సోషల్ మీడియా జనులు ఎదురు చూస్తున్నారు.

రాజకీయాలు తనకు సరిపోవని నిర్ణయం తీసుకుని సినిమాలు చేసుకుంటున్న తర్వాత కూడా రాజకీయ పరమైన అంశాలపై స్పందిస్తే, అది కూడా ప్రజా మద్దతు లేని నిర్ణయాలకు వంత పాడితే, ఏదొక రోజు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని ఇప్పటికైనా చిరంజీవి తెలుసుకోవాలి అంటున్నారు రాజకీయ పండితులు.