‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ఆడియో వేడుకకు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఈ సినిమా కధ గురించి క్లుప్తంగా చెప్తూ… తానూ ఈ సినిమా రషెస్ చూసేసానని పేర్కొన్నారు. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా టైటిల్ తో తాను సరితతో 80వ దశకాల్లో ఒక సినిమాలో నటించానని, ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా అద్భుతంగా ఉందని, పెళ్లిళ్లకు అభ్యంతరాలు చెప్పే తండ్రికి – కుమారుడికి మధ్య జరిగే ‘ఇగో క్లాషే’ ఈ సినిమా కధగా క్లుప్తంగా చెప్పుకొచ్చారు మెగాస్టార్.
కత్తి మీద సాము లాంటి ఈ కథను దర్శకుడు పరుశురాం మలచిన విధానం అద్భుతంగా ఉందని.., డైలాగ్స్ కూడా బాగా అద్భుతంగా ఉన్నాయని.., ఏ కథనైతే దర్శకుడు అనుకున్నారో దానిని అలాగే చిత్రీకరించారని.., ఈ సినిమా చూడగానే తనకు ‘బొమ్మరిల్లు’ గుర్తుకు వచ్చిందని అన్నారు. గత రెండు సినిమాల్లో చూసిన శిరీష్ కు నటనపై ఇంకా పట్టుకావాలనిపించిందని, ఈ సినిమాలో ఆ అనుమానాలు పోగొట్టాడని, అంతేగాక చాలా కొత్తగా కనిపించాడని అభినందించారు.
శిరీష్ నటుడవుతాడని తాను ఎప్పుడూ భావించలేదని, తండ్రి మాదిరి నిర్మాతగా మారతాడని భావించానని, ఎప్పుడూ లెక్కలు మాట్లాడే శిరీష్ ఒక రోజు వచ్చి, ‘మావయ్యా… ఆర్టిస్టు అవుతానని’ అన్న విషయాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్.., ‘మన ఫ్యామిలీ అభిమానులు ఆదిరిస్తారు, వెళ్లి నటించు, అని వెన్నుతట్టి ప్రోత్సహించనని అన్నారు. అయితే శిరీష్ మిగిలిన మెగా హీరోల మాదిరి కాకుండా, హడావుడిగా సినిమాల్లో నటించకుండా నిదానంగా సినిమాల్లో నటిస్తూ, అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం విశేషమని, అది మంచి పద్ధతని అభినందించారు.