ఎన్నికల సంఘం చేత నియమింపడిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పని చేస్తున్నారు. బీజేపీ సపోర్టుతో చెలరేగిపోతున్నారు. ఒక పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ, మే ఇరవై మూడో తేదీన శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఆ ఫలితాలలో టిడిపి గెలిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతారని, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రమాణ స్వీకారం చేయవచ్చని సుబ్రహ్మణ్యం అన్నారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ అద్యక్షుడు జగన్ మే ఇరవైనాలుగున లేదా మరో మంచి తేదీన ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఆయన అన్నారు.
అంతే తప్ప అధికారంలో ఉన్నవారు తమకు జూన్ ఏడు వరకు అవకాశం ఉందని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఐదేళ్ల కాలపరిమితి అన్న విషయం వాస్తవమేనని, కాని దానర్దం ఎన్నికలు అయిపోయాక కూడా కొనసాగడం అని కాదని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పిన మాట వాస్తవమే. అయితే మే 23న ఫలితాలు వచ్చాక కొత్త ప్రభుత్వం ఏర్పడినట్టే. అప్పుడు గనుక జగన్ గెలిస్తే చంద్రబాబు తప్పుకోవాల్సిందే.
కానీ మే 23వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబే ముఖ్యమంత్రి. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రభుత్వం మారిపోయినట్టు ఆయన వ్యవహరిస్తే ఆయనకే మంచిది కాదు. మే 23 తరువాత పరిణామాల గురించి ఇప్పటివరకూ చంద్రబాబు మాట్లాడలేదు. ఇలా ప్రభుత్వ అధినేత మీద వ్యంగ్యంగా మాట్లాడితే ఆయన తన పరిధి దాటి మాట్లాడుతున్నారు అనే అనుకోవాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయనకే ఇబ్బంది.