అప్పట్లో టీడీపీ సింగపూర్ ఫార్ములా అమ్మితే.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలను మూడు రాజధానుల పేరిట వంచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీనిపై అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. గాజువాక ప్రజలు చీకొట్టారన్న ద్వేషంతోనే విశాఖపట్నానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ విమర్శించారు.
పవన్ కళ్యాణ్ లోని అపరచితుడు మరోసారి బయటపడ్డారని ఆయన అన్నారు.విశాఖ మరో నందిగ్రామ్ అవుతుందనే పవన్ మాటల్లో అర్థం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్ర పన్నుతున్నారా?’’ అని ఆయన అన్నారు.
విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబుకు విశాఖ ఎయిర్పోర్టులో పట్టిన గతే పవన్కు పడుతుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో చంద్రబాబు పరువు లేకుండా చేశారని, ఇప్పుడు సినిమాల్లో నటిస్తే కనీసం ఆస్తులైనా మిగులుతాయని ఆయన ఫల్గుణ పేర్కొన్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై విమర్శ చెయ్యకముందు చంద్రబాబు పై విమర్శ చేశారు. అయినా సరే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రహస్య మిత్రులు అనే తమ ఇది వరకటి స్టాండ్ మీదే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్తున్నారు.