Chennampalli treasure huntప్రస్తుతం కరువుకాటాకాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం కరుణ చూపకపోవడంతో, బహుశా ఆ బాధ్యతను దైవం తీసుకున్నారో ఏమో గానీ, మరికొద్ది గంటల్లో ఏపీ సర్కార్ పంట పండినంత వార్త బయటకు రాబోతోందని సమాచారం. ఏంటి… సినిమాల్లో చూపించినట్లుగా ఏదైనా గుప్త నిధి చంద్రబాబు ప్రభుత్వానికి దొరకబోతోందా అని అనుకుంటున్నారా? నిజమే అదే జరగబోతోంది!

అవును… కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో దాదాపు 500 ఏళ్ల క్రితం దాచిన వజ్ర వైడూర్యాలు, బంగారంతో కూడిన భారీ నిధి ఎక్కడ ఉందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ అధికారులు తెలుసుకున్నట్టు సమాచారం. గత ఐదు రోజులుగా పోలీసుల సాయంతో, భారీ యంత్రాలతో ఈ ప్రాంతంలో తవ్వకాలు సాగించిన గనుల శాఖ అధికారులు నిధి ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నట్టు తెలుస్తోంది.

ఈ విషయమై మరి కాసేపట్లో స్పష్టమైన ప్రకటన కూడా వెలువడుతుందని సమాచారం. నిధి ఉన్న ప్రాంతానికి చాలా సమీపానికి అధికారులు చేరుకున్నారని, మరికొద్ది గంటల్లోనే అక్కడ ఏముందన్న విషయం తెలుస్తుందని అధికారులు అంటున్నారు. చెన్నంపల్లి రాజులు, గుత్తి రాజుల మధ్య యుద్ధం ప్రారంభమైన వేళ, తమ వద్ద ఉన్న మొత్తం నిధిని, చెన్నంపల్లి కోటలోనే దాచారని ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో కథలు ప్రచారంలో ఉన్నాయి.

విజయనగర రాజుల కాలంలో రాసులుగా పోసి అమ్మే వజ్రాలను, మణి మాణిక్యాలనూ, బంగారాన్ని దాచి, దానిపై సీసం పోశారని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు భారీ వర్షాలు పడినా వజ్రాల కోసం ప్రజల వేట సాగుతుండటం, కొంతమందికి వజ్రాలు దొరికినట్టు వార్తలు రావడం విదితమే. పలుమార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి.

కానీ, ఈ దఫా మాత్రం అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ప్రభుత్వమే స్వయంగా నిధిని వెలికి తీసేందుకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడ నిధి ఉందా? భూగర్భ స్కానింగ్ లో లోహంలా కనిపించినది ఏమిటన్న విషయమై నేడు సస్పెన్స్ వీడుతుందని తెలుస్తోంది.