ఆలిండియా చలన చిత్ర రికార్డులు బద్దలు కొట్టిన “బాహుబలి” సినిమాలోని ‘శివగామి’ పాత్ర పోషించిన రమ్యకృష్ణ బాహుబలిని కాపాడే సన్నివేశం గుర్తుందా..! నీటిలో తానూ మునిగిపోతున్నా చిన్న పిల్లవాడ్ని కాపాడిన ఆ సీన్ సినిమాలోని హైలైట్ అయిన విషయాలలో ఒకటి. అయితే అదంతా వెండితెరపై చూపించిన అభూత కల్పన. కానీ, అదే ఫీట్ ను రియల్ గా చేసి చూపించింది యుఎస్ వాసి ఛెల్సీ రస్సెల్.
యూఎస్ లోని కొలరాడోలో వరద నీటిలో పడిపోయిన తన రెండేళ్ల కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను వదిలింది ఈ తల్లి. కొలరాడోను వరద నీరు చుట్టుముట్టిన వేళ 33 ఏళ్ళ ఛెల్సీ రస్సెల్ అనే మహిళ తన రెండేళ్ల కుమారుడు పోవెల్, కుటుంబంతో కలసి హౌస్ బోట్ లో విహరిస్తోంది. వరద నీటి ధాటికి పోవెల్ నీటిలో పడిపోగా, ముందూ వెనుకా ఆలోచించకుండా రస్సెల్ నీటీలో దూకేసింది.
అయితే, బిడ్డను చేరుకుంది గానీ, నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంటే ఏం చేయాలో పాలుపోలేదు. బిడ్డను గాల్లో ఉంచుతూ, తాను నీటిలో ఉండిపోయింది. కుటుంబ సభ్యులు హౌస్ బోట్ ఆపి, మరో బోటులో వారి దగ్గరకు చేరి, తల్లీ బిడ్డలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించే సమయానికే ఆమె మరణించింది. అయితే ఆమె చేసిన త్యాగం మాత్రం వృధా కాలేదు, రెండేళ్ళ బాబు క్షేమంగా బయటపడడం కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది.