ఇప్పటివరకు సాగిన సిట్ విచారణ ఓ వంతు… హీరోయిన్ ఛార్మి విచారణ ఓ వంతు… అన్న పబ్లిసిటీని తెచ్చుకోవడంలో ఛార్మి విజయవంతమైందనే చెప్పాలి. తనపై సిట్ విచారణకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా, గత రెండు రోజుల పాటు మీడియాకు ఆహారంగా మారిన ఛార్మి, నేడు సిట్ కార్యాలయంలోనే విచారణ హాజరయ్యారు. బౌన్సర్ల నడుమ సిట్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఛార్మి, తనతో పాటు న్యాయవాదిని కూడా వెంట తెచ్చుకుంది.
ఉదయాన్నే పూరీ జగన్నాధ్ ‘పైసా వసూల్’ షూటింగ్ స్పాట్ కు వెళ్లి, సిట్ కార్యాలయానికి వచ్చిన ఛార్మి, బ్లూ కలర్ టాప్ అండ్ జీన్స్ లో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు సిట్ విచారణకు హాజరైన పూరీ జగన్నాధ్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా… ఇలా అందరూ తెల్ల చొక్కాను ధరించి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాము నిరపరాధులమని సంకేతాలు ఇచ్చేందుకే వీరంతా తెలుపు రంగు దుస్తులను ధరించారని ట్రేడ్ వర్గాలు పేర్కొనగా, ఛార్మి మాత్రం ‘వైట్’ సెంటిమెంట్ ను దానిని బ్రేక్ చేసింది.
సాయంత్రం అయిదు గంటల వరకే సాగనున్న ఛార్మి విచారణ ద్వారా ఈ డ్రగ్స్ కేసులో అత్యంత కీలక సమాచారం వెలువడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో… ఛార్మి విచారణకు ఏ విధంగా సహకరిస్తారు? అనేది వేచిచూడాలి. కెల్విన్ మొబైల్ లో ఛార్మి పేరు ‘దాదా’గా పేర్కొనడం, అలాగే వీరిద్దరి మధ్య దాదాపుగా వెయ్యికి పైగా వాట్సప్ సందేశాలు జరగడం వంటివి ఇప్పటికే సాక్ష్యాలుగా లభించడంతో…. వీటిని ఛార్మి ఏ విధంగా సమర్ధించుకుంటుందో కీలకం కాబోతోంది. సిట్ కార్యాలయంలోకి వెళ్ళేటపుడు మాత్రం కాస్త ఆందోళనగానే ఛార్మి మీడియా కంట పడింది.