Vizag - Prasad is no moreటాలీవుడ్ లో మరో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైజాగ్ ప్రసాద్ నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 75 సంవత్సరాలున్న ప్రసాద్ కు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలు రత్నప్రభ, రత్నకుమార్ ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది.

వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖలోని గోపాలపట్నం స్వగ్రామం. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన, టీవీ సీరియల్స్ లోనూ పలు కీలకమైన పాత్రలు పోషించి తెలుగు అభిమానులకు వినోదాన్ని అందించారు. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చిన వైజాగ్ ప్రసాద్, తేజ దర్శకత్వంలో వచ్చిన “నువ్వు నేను”లో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రను పోషించి, మెప్పించిన తరువాత, వరుసగా అవకాశాలను పొందారు.

భద్ర, జై చిరంజీవ, గౌరి, జానకీ వెడ్స్ శ్రీరామ్ తదితర చిత్రాల్లో నటనతో గుర్తింపు పొందారు. కాగా కూతురు రత్నప్రభ అమెరికాలో, కుమారుడు రత్నకుమార్ లండన్ లో నివాసం ఉంటుండగా, వారికి కబురు చేశామని, వారు వచ్చిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయని ప్రసాద్ కుటుంబీకులు తెలిపారు. వైజాగ్ ప్రసాద్ మృతికి టాలీవుడ్ సంతాపం వెలిబుచ్చింది.