‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్బాబు నటించబోతున్న సినిమాపై సహజంగానే అంచనాలు తారా స్థాయిలో వస్తాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే కనీసం ‘శ్రీమంతుడు’ స్థాయిలో అయినా సినిమాను తీయాల్సి ఉంటుంది. ఇప్పుడే అదే శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద తల నొప్పిగా మారింది. మహేష్బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ను ‘శ్రీమంతుడు’ సక్సెస్ తర్వాత పలు సార్లు మార్చారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. మరోసారి ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సీన్స్ను మార్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ కథాంశంతో ఈ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా మొదటి నుండి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్బాబు ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను పదే పదే ఆదేశించాడు. మొత్తంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా కాస్త ఇప్పుడు మాస్ ఫ్యామిలీ చిత్రంగా తయారు అవుతుందని చెబుతున్నారు. స్క్రిప్ట్ను పలు సార్లు గెలికితే ఫలితం తారు మారు అయ్యే ఛాన్స్ ఉందని, మహేష్బాబు ఇకనైనా శ్రీకాంత్ అడ్డాల పనిని చేయనిస్తే బాగుంటుందని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. వచ్చే ఏప్రిల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్కు జోడీగా సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరితో కలిసి మహేష్బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.