ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ప్రభుత్వాలు రోడ్లను నిర్మించేది మనుషులు, వాహనాలు వెళ్లడానికని, విగ్రహాలు పెట్టుకునేందుకు కాదని, అలా కాకుండా విగ్రహాలు పెట్టాలని ఎవరైనా నిర్ణయించుకుంటే వారి వారి నివాసాల ముందు పెట్టుకోవాలని” పలికిన వెటకారపు మాటలు వైసీపీ వర్గాలకు నేరుగా తాకాయి.
ఇక, ఆగష్టు 2వ తేదీన వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపుపై కూడా స్పందిస్తూ… బంద్ అనే పదానికి కొత్త భాష్యం చెప్తూ… బంద్ అంటే రాష్ట్రం మొత్తం చీపుర్లతో శుభ్రం చేయాలని అన్నారు. అలాగే ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ విధుల్లో అదనపు గంటలు పని చేయాలని సూచించారు. ఇలా చేసినప్పుడు వేసుకున్న దుస్తులకు బ్లాక్ రిబ్బన్ ధరించాలని అన్నారు. సాధారణంగా చేసే పని కంటే మరింత ఎక్కువ పని చేసి కొత్త పద్ధతిలో బంద్ చేయాలని వ్యాఖ్యానించారు.
అలా కాకుండా ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, ఇకపై అంతకంటే తీవ్రంగా పోరాడుతామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పిన విధంగా బంద్ చేయవద్దని పిలుపునిచ్చారు ఏపీ సిఎం. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో ఆందోళన నిర్వహించిన వైసీపీ వర్గాలను ఉద్దేశిస్తూ సిఎం స్పందించారు.