ఆంద్రప్రదేశ్ లో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు జరిగిన బంద్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. బంద్ వల్ల జరిగే నష్టాన్ని ప్రతిపక్షాలు ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు. అన్యాయం చేసింది కేంద్రమైతే ఈ బంద్ లు మనల్ని మనం శిక్షించుకుంటున్నట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎపికి అన్యాయం చేసినవారే శిక్షింపబడాలని ఆయన సూచించారు. మన నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలని, అందుకే అరగంట సేపు నిరసనలో పాల్గొని.. అధికంగా మరో గంటసేపు పనిచేయాలని సూచించారు. అయితే చంద్రబాబు ఈ సూచన విపక్షాలకు రుచించలేదు. దీనితో యథాప్రకారం చంద్రబాబు దూషణకు దిగారు.
అయితే వివేకంతో ఆలోచిస్తే ఆయన మాటలలో నిజం అర్ధం అవుతుంది. ఇప్పటికే ఆర్ధిక బాధలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం ఈ బంద్ ల పేరుతో ఇటువంటి రభసను తట్టుకోగలదా? రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామని వస్తున్న వారికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ నిరసనలేవో వెళ్ళి ఢిల్లీలో చేస్తే కేంద్రప్రభుత్వంలో ఏదైనా కదలిక వస్తుందేమో!