మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 11.30కు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకి చేరుకోగానే హై డ్రామా నడిచింది. చంద్రబాబును అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబు ఉత్తరాంధ్ర వ్యతిరేకి అని, మూడు రాజధానులు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇది స్థానిక ప్రజలు చేస్తున్న నిరసనగా సాక్షి చిత్రీకరించే ప్రయత్నం చెయ్యగా, అది వైఎస్సార్ కాంగ్రెస్ పని అని తేలిపోయింది. నిరసనలో కొందరు చేతబట్టిన ప్లకార్డుల మీద మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోటోలు ఉండగా, సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో దానిని ధృవీకరిస్తుంది.
ఆ వీడియోలో… తమను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారని ఎయిర్ పోర్టుకు వచ్చిన వారు చెబుతున్నారు. తమకు ఒక్కొక్కరికి రూ. 500 ఇచ్చారని ఓ మహిళ చెప్పుకొచ్చింది. డబ్బులిస్తే వచ్చారా అని ఓ వ్యక్తి అడగగా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. దీన్ని అతను ఓ సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార పార్టీ అభాసుపాలు అయినట్టు అయ్యింది. ఇది ఇలా ఉండగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అధికార పార్టీ వారిని కంట్రోల్ చెయ్యలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకోవడం విశేషం.