స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వేంకటేశ్వర రావు మంగళవారం ఉదయం గుండెలో నొప్పి వస్తుండటంతో వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో చేర్చారు. ఆయనకు గుండె పోటు వచ్చినట్లు గుర్తించిన వైద్యులు తక్షణం యాంజియోప్లాస్టీ చేసి రెండు స్టంట్స్ అమర్చారు. గుండెకు రక్తం సరఫరా జరిగే రెండు నరాలు బ్లాక్ అయినట్లు పరీక్షలలో గుర్తించి స్టంట్స్ వేశామని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
ఈ విషయం తెలుసుకొన్న చంద్రబాబు నాయుడు వెంటనే అపోలో హాస్పిటల్కు వెళ్ళి దగ్గుబాటి దంపతులను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని కోరుకొన్నారు.
ఎన్టీఆర్ మరణం తరువాత దగ్గుబాటి దంపతులు టిడిపికి దూరమయ్యారు. పురందేశ్వరి బిజెపిలో చేరడంతో ఇరు కుటుంబాల మద్య రాజకీయంగా కూడా దూరం పెరిగింది. ఇరు కుటుంబాల మద్య ఆ దూరం అలాగే ఉండిపోయింది. దాంతో ఇరు కుటుంబాలు ఏవో పెళ్ళిళ్ళు శుభకార్యాలలో తప్ప పెద్దగా కలిసింది లేదు.