అధికారంలోకి వచ్చిన రెండున్నర్ర సంవత్సరాల తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ పై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, ఎట్టకేలకు సిద్ధం చేసిందన్న మాట వాస్తవమే. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయనున్నారన్న వార్తలో చివరి నిముషంలో పెట్టిన మెలికకు ఏపీ సిఎం చంద్రబాబు తగ్గకపోవడంతో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
‘ప్రత్యేక ప్యాకేజ్’ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ప్రకటించి, పరోక్షంగా సిఎం కూడా అంగీకరించారన్న భావన ప్రజలలో కలిగించేందుకు ఉన్నట్లుండి ఢిల్లీ రావాల్సిందిగా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుల నుండి చంద్రబాబుకు పిలుపువచ్చింది. దీంతో 12.30 గంటలకు రావాల్సిన ప్రకటన కాస్త 2.30 నిముషాలకు వస్తుందని భావించారు. అయితే కేంద్రం ఆలోచనను పసిగట్టిన చంద్రబాబు, అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి చర్చలు జరిపారు.
ప్యాకేజ్ ను చంద్రబాబు సమక్షంలోనే ప్రకటిస్తే… హోదాపై డిమాండ్ చేసే అవకాశాన్ని కోల్పోతాం గనుక, చంద్రబాబు సర్కార్ కాస్త తెలివిగా ‘ప్యాకేజ్ లో మరికొన్ని డిమాండ్లను చేర్చి, అవి ఉంటేనే ఢిల్లీ వచ్చేది’ అన్న సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా రైల్వే జోన్ పై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న నేపధ్యంలో… అది విశాఖకే పరిమితం కావాలన్న డిమాండ్ ను కేంద్రం ముందు స్పష్టంగా ఉంచారు చంద్రబాబు. ఇలా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ తదితర 9 అంశాలను కేంద్రం ముందుంచారు. అయితే ఈ డిమాండ్లను కేంద్రం అంగీకరించే పరిస్థితి లేదు.
ఇప్పటివరకు ఉన్న ఆర్ధిక లోటును భర్తీ చేయాలన్న డిమాండ్ అసాధ్యం అన్న విషయం కేంద్రం తేల్చేయడంతో ఏపీపై చేయాల్సిన ప్రకటన మరింత ఆలస్యం అయ్యింది. అయితే చంద్రబాబు ‘ప్యాకేజ్’ను ప్రకటిస్తేనే ‘ప్రకటన’ ఉంటుందని కేంద్రం మరో మెలిక పెట్టడం… ప్యాకేజ్ ను అంగీకరించేది లేదు, హోదా తప్ప అని చంద్రబాబు స్పష్టంగా తెలపడంతో… నేడు వస్తుందో, రేపు వస్తుందో లేక మరికొన్ని రోజులు వేచిచూడాలో కూడా స్పష్టత లేదు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లో క్షణం క్షణం మారుతున్న నాటకీయ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో… కేంద్రం ప్రకటన ఏమవుతుందో అన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో నెలకొని ఉంది.